ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహం మార్చింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్కు పొరుగున గల హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలిసింది.సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై శుక్రవారం స్పష్టత వచ్చే వీలుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా సీఎం కేసీఆర్ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.