ఎపి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్) పరిధిలోని ఐదు జిల్లాల్లో పని చేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని దినాల కుదింపు నిర్ణయాన్ని ఉపసింహరించుకోవాలని కోరుతూ ఎపి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన శుక్రవారం నగరంలోని ఎపిఇపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమను పర్మినెంట్ చేయాలని, పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు జిఎస్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో కాంట్రాక్టు పీస్ రేటు పద్ధతిలో సుమారు 1550 మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు నెలలో 16 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీస్తారని, ఇప్పుడు పని దినాలను 15 రోజులకు తగ్గించడం దారుణమన్నారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి చేసిన వాగ్దానం మేరకు పర్మినెంట్ చేయాలని, లైన్మెన్లగా, అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్లగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కెఎస్వి.కుమార్, యూనియన్ డిస్కం ప్రధాన కార్యదర్శి ఇకెఎస్డిఎస్కె.రెడ్డి, నాయకులు ఆర్.రామకృష్ణ, క్రాంతి, కుమారస్వామి, పిబి.శ్రీనివాస్, శ్రీనివాసరావు, నాగబాబు, మీటర్ రీడర్లు పాల్గొన్నారు.