కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం నుంచి కాలనీల్లో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ అవసరమైన వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇంటింటికీ రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ అందించామన్నారు. కరోనా నివారణకు కేవలం టీకా తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు .