2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో జనసేన పార్టీ పోటీ చేసింది. అయితే ఒక్క తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గంలోని జనసేన సేనఅభ్యర్థి రాపాక వరప్రసాద్ మినహా అనూహ్యంగా జనసేన అధినేత పవన్ సహా అందరూ ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాపాక అధికార పార్టీలో జాయిన్ అవుతారనే వార్తలు వినిపించినా.. అప్పట్లో ఆయన అవి అన్నీ పుకార్లంటూ కొట్టిపడేశారు. అధికార పార్టీలోకి వెళ్తే.. నేను 152.. అదే మా జనసేనలో ఉంటె.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నచందంగా మాట్లాడారు.. కానీ కాలక్రమంలో రాపాక జనసేనకు దూరంగా అధికార పార్టీ వైసీపీకి దగ్గరగా జరగడం మొదలు పెట్టారు. అంతేకాదు.. అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ వైపు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలకు జై కొట్టడం మొదలు పెట్టారు. అయితే రాపాక వరప్రసాద్ రావు మాత్రం తాను అధికారికంగా జనసేనను వీడి.. వైసీపీలో చేరుతున్నానని చెప్పలేదు. ఇటు జనసేన కూడా అసలు తమకు ఒక ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గెలిచాడు అన్నట్లు భావించడం లేదు అన్నట్లు ఉన్నది.. అయితే ఇటీవల వైసీపీ నేతలు చేపట్టిన దీక్షల్లో పాల్గొన్న రాపాక.. వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ విషయంపై వివాదం చెలరేగింది. పార్టీ ఫిరాయింపులను మేము ఒప్పుకోము అని మొదటి నుంచి చెబుతున్న వైసీపీ సర్కార్ ఈ విషయంపై ఏ సమాధానం చెబుతుంది అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక రాజోలు నియోజక వర్గం వైసీపీ ఇంచార్జ్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.